Wednesday, January 13, 2016

తన్మయాత్మక వేదనాశకలపు సౌందర్య కవిత్వం - అరుణ్ బవేర యిలాంటి వో ప్రయాణం

  తన్మయాత్మక వేదనాశకలపు సౌందర్యాత్మక కవిత్వం - అరుణ్ బవేర యిలాంటి వో ప్రయాణం...

అరుణ్ బవేర వైయక్తికంగా ఆలోచనకూ ఆచరణకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఘాఢమైన పారదర్శక నిత్యనూతనానుభవాలతో జీవిస్తూ కవిత్వ సేద్యం చేస్తున్న హాలికవి. బవేర యిలాంటి వో ప్రయాణం జీవితం లాంటి సహజ,శ్రేష్టమైన మనిషి కోసం చేస్తున్న అన్వేషణ. యే వాద వివాదాలకు,కూటములకు,లాబియింగ్లకు అచ్ఛాదన యివ్వక,యివ్వలేక స్వచ్ఛమైన మానుషత్వంతో తన సొంత శైలిలో, అర్థ ధ్వనుల ప్రపాతంలో, మనుషుల్లో తడిని సృష్టిస్తూ,బాషా శిల్పాల జుగల్బందీలకు ఆవల వొకానొక పురాసంస్పందనతో స్వాభిమానసాధికారత కల్గిన యీ కవి నగ్నవుదయపు వొంటరి దుఖంలో తన లలిత రచనాకర్మను అన్ అకడమిక్ గా...విక్షుబ్దంగా మోహభంగుడై తన సంపూర్ణ తన్మయత్వంలో గంభీర స్వరాన్ని విన్పిస్తున్న కవి.
         బవేర ప్రాకృతిక జీవితాన్ని తవ్వే క్రమంలో పొందిన సంతోష దుఖాలను తన కవిత్వంలో అనువదించారు. మనకాన్షష్ను షూట్ చేసే కవిత్వం. మనల్ని తన అంతర్ముఖత్వంలోకి లాకెళ్ళే కవిత్వం బవేరది. Get drunk/stay drunk/on wine,virtue,poetry/what ever(బాదలేర్)లాంటి మాదకత,తన్మయత యితని కవిత్వంలో ......"నా సోగకళ్ళ సుడిలో రేగిన/చిట్టచివరి పరవశమా!
నీ చిగురుటాకు చెక్కిలిపై/ నా చెంగల్వ పూదండ" (కుంకుమ సాయంత్రాలు)

"సీతాకోకచిలుకై వచ్చి చేతివేళ్ళమీద వాలుతాయి/వచ్చి పోయే గాలుల్ని/ మురిపెంగా ముద్దాడినట్లు/జీవితం తడి ఆరని వెన్నెల(తడి ఆరని వెన్నెల)
 మహా కావ్యపంక్తుల్లా మరో కవిత రూప సారాల్ని విశ్లేషించించేదుకు వొక ప్రామాణిక నమూనలాంటి కవితాఝరి యిలాంటి వో ప్రయాణం. యితని కవిత్వం చదువుతుంటే మనలో మూల్యాంకన నిర్మాణప్రక్రియ దానంతటదే ప్రారంభమౌతోంది. యితని కవిత్వం epitom of poetry లా వున్నత సౌందర్య విలువలతో, కవిత్వ గుణ సార్వభౌమత్వంతో నిలిచిపోతున్న కవిత్వమిది.
                యితని కవిత్వం అసహజతల్ని,కృతిమతల్ని ఆవల తరిమి సహజసొబగుల గుభాళింపులతో సమ్మోహన పరచి ముగ్ధతను సాధించి సేదతీరుతున్నట్టే వున్నా ...... మరో జీవన సౌందర్యదాహం అతన్ని వెంటాడి కవిని కాదు..కాదు...
మనిషిని చేస్తూ మరో కవితాధారై ప్రవహిస్తుంటుంది యిలా...యెంతటి స్పష్టమైన అవధారణలు...తనలోని సౌందర్యావిష్కరణ నిమిత్తం తన ప్రయనించే క్రమంలోని ఘర్షణ వొక యుద్ధ సమానం....'కొన్ని వీరోచిత క్షణాల్లో ' బతుకు పట్ల తన సన్నధతను ప్రకటిస్తాడిలా - 'బ్రతకడం వొక అపరిత విశ్వాసం/మరికొన్ని వీరోచిత క్షణాలు...' యింకా యిందులోనే సరైన కలకోసం వేల రాత్రులు నిద్రపోయే తపన, మానవ సంబధాల పట్ల వొక pure effort ...existed disorders పట్ల నిశ్చేష్టతతో కూడిన 'ఖాళీతనంతో యేం మాట్లాడుతాం'....దేనిమీద యే రకమైన రుచిలేనితనపు సంవేదనాహీన సమూహాల పట్ల చింత 'కొన్ని వీరోచిత క్షణాలు' కన్పిస్తుంది. యిందులోనే వొక అంతర్ సంక్షోభంలో సహజాతవసరపు తక్షణ అవసరాన్ని గుర్తించి తన survival ప్రాధాన్యతను "యిక ఆకలి గురించి తప్ప/ప్రేమ గురించి మాట్లాడుకోలేని సంధర్భం"అంటాడు ...వర్తమానం నిరంతరమయ్యే సమూహపు విచ్ఛిన్నత సృష్టించిన హింస పట్ల వ్యక్తమయ్యే బాధ సుష్పష్ట దృశ్యపు ప్రయోగాత్మక ముక్క యిలా - " మన మాటలు మన గొంతుల కిందే తగలబడుతున్నాయి/కొత్తగా మనం భయాల్ని శ్వాసిస్తున్నాం/గాయాలకి దేహం యిచ్చాం." మన జీవితం యే స్థితికి చేరుకుందంటే -"యిప్పుడు జీవించడానికి / ప్రేమించడానికి / వొక యుద్ధం అనివార్యమైందనే"వర్తమాన జీవన వాస్తవికత యితని కవిత్వంలో...
   వొక జ్ఞాపకపు శకలం నుంచి ప్రారంభమైన బాధ ...తన ఆత్మ స్వేచ్ఛా ప్రపంచంలోకి పయనించి ...ఆనందక్షణాల్లో తేలియాడి తిరిగి దైనందిన జీవితంలోకి వొక రాతిరి నుంచి మరో పగట్లోకి అంతమయ్యే అంతమయ్యే వొక సాదృశ్యాత్మక కవిత - ప్రియురాలి బుగ్గల్లో సిగ్గులు చేసుకునే ఉత్సవం. యీ కవితలో బాల్యంలో చూసిన వో దృశ్యం - 'ఏటి ఒడ్డున ఏతం తోడిన నీటిలో /స్నానిస్తున్న పిట్టల్లాగ '. మధ్యలో - 'చెట్లెక్కి గాలిలా ఆకుల్లో దూరి/ నవ్వుకొని మురిసిపోయే క్షణాల్లో'కవి వుపశమనాన్ని పొందుతూ,రాతిరి సౌందర్యాన్ని దర్శించే అంతఃచైతన్య ఝరి నుంచి సామాన్య సృహ లోకి పయనించే కవితాత్మకత చివర్లో ఆకట్టుకొంటోంది - 'పునః పునః విఫలమైన క్షణాల్లో/ మిగిలే ఒక భారమైన నిరీక్షణ.'
                    జీవితం పట్ల కవికున్న స్పష్టత కింది పంక్తుల్లో ప్రస్పుటతమౌతుంది - 'జీవితం నిర్వచన స్థాయి నుంచి ఎదగలేదని/జీవితం విస్మయంగా మొదలై/విలోమంగా గడచి,విచారంగా ముగుస్తుందని/మధ్య మధ్యలో సంతోషం గడ్డి పువ్వై పూస్తుందని చెప్పడం ఘాఢమైన అనుభూతి కల్గిన బవేరాకే సాధ్యమైంది. రెండు పొడివేళ్ళ మధ్య వొక తడి సంతకం అనే కవిత మార్మక అర్థంలో లిఖింపబడింది...చాలా సింపుల్గా వుండే నిర్మాణంలో గొప్ప టెక్నిక్తో లిఖించుకు పోయిన కవితలు చాలా వున్నాయి - 'రోజు ధైర్యంగా తాకే భయం/రాత్రంతా నదిలో యీదిన చంద్రుడు/తెల్లారేసరికి జాలరి వలలో చిక్కాడు'.
                        మనిషి మనిషిగా మారేందుకు ప్రకృతి సిద్ధ గుణాలు వుండనే వున్నాయి దాని నుంచి గ్రహించే ధ్యాన మగ్నతను మనిషి కోల్పోతున్నాడూ. కవి దయామయ విశ్వప్రాకృతికత లోకి పయనించి మైత్రిని సాధిస్తాడిలా 'ఒక అనంతయాత్ర'లో - 'నా చుట్టూ విశ్వం/పరమ దయాత్మకంగా పోగిపడుతుంది/ళిత లావణ్యంగా/మనసు పొరల్లోకి యింకుతూ../యుగాల మైత్రిగా /స్నేహంగా ఉదయించింది.'
          అనంతంగా సాగే యీ కాల గమనంలో మనమూ వొక క్షణకాల పాత్రధారులం కాదా.....ప్రకృతి ముందు మనం వొక చిన్న కణంలాంటి వారం కాదా....వొక వర్టికల్ మనిషిని నిలువుగా  చీల్చే అహంకారపు పరిమిత పరిధిని గ్రహించిన కవి కవిత చివర్లో ఆనంద వినయంతో ప్రకృతి ముందు మోకరిల్లిన కృతజ్ఞతా ప్రకటన యిలా - ' ప్రకృతికెదురుగా / ఓడిపోతూ/నిట్టనిలువుగా చీలిపోవడం/ఒక మహాదానంద సందర్భం'.
                 యిలాంటి వో ప్రయాణం లోని కవితలు కవి తన ఆత్మతో చేసిన సంభాషణలు...యివి కలలై, ఆ కలలు వర్షంలో తడిచి ముద్దయి, వెంటాడి, నిద్దట్లోంచి రాలి,పక్షులు పొడుచుకు తినే'లాంటి భిన్న సంధర్భోచిత ప్రయోగాలు ఆకట్టుకుంటాయి.
యింకా పూలభాష తెలసిన సీతాకోకచిలుకలతో మాట్లాడడం, పక్షిలా నిద్రలేవడం, ఇంద్రధనస్సు తో పొలాలు మాట్లాడడం...ఆత్మల్లో యింకే వర్షం...ప్రేమను మైకంగా అనుభవించే దాహంలో కవిత్వం నిండుగా కన్పించి మనలో సెలయేరై రాలి నదిలా మారి ముగింపునకు చేరువయ్యే కొద్ది మనలో ప్రవహించే యీ బతికే క్షణాల అభివ్యక్తి ప్రేమమయమై మనుషుల్ని చేస్తోంది.

              

Thursday, December 3, 2015

ఈనాటికవిత-48
__________________________
పఠాన్ మస్తాన్ ఖాన్ -గొంతు నులిమిన శ్వాస'
"ఆశాబద్ధతే జంతుః కర్మణా బహిచింతయః" ప్రాచీనుల మాట.ఆధునిక అర్థపరివర్తనలో,కవిత్వార్థంలో కల,స్వప్నం,ఆశ పర్యాయాలుగా కనిపిస్తాయి.పఠాన్ మస్తాన్ ఖాన్ కవిత-"గొంతు నులిమిన శ్వాస'లోని స్వప్నం కూడ ఆశనే సంకేతిస్తుంది.ఆశకూడా మానసికమైందే.
భౌతిక జీవితపు సంఘర్షణ,వాస్తవిక అధివాస్తవిక అనుకలనాలు ఈ కవితలో ఉన్నా.ఈ సృజన మానసికమైందే.మనోవైజ్ఞానికశాస్త్రంలో ఆలోచనాపవ్యవస్థ(Thought disorder)ఒకటి ఉంది.తనవ్యక్తిత్వాన్ని,సత్యాన్ని అర్థం చేసకునే స్థితి.ఇందులో వ్యక్తి వివేకం నిలబడి,సంసర్గాలు(భ్రాంతులు)సడలి నూతనసృష్టి జరుగుతుంది.ఈ కవితలో దీనికిపూర్వాపరాలనే ఖాన్ చిత్రించారు.
1.బతుకులో స్వప్నాలుంటాయి
స్వప్నాలకు యినుపరెక్కలొస్తాయి
యెగరలేక పోతుంటాను
అర్థ్రాంతరంగా...
మేల్కొంటాను
స్వప్నంలో నుంచి
జీవితంలోకి....
2.సత్యం
అర్ధాన్ని కోల్పోతుంది
చావు పుట్టుకలు
సంగమించినపుడు
కన్పించినట్టే కన్పించి
మాయమౌతుంటుంది
గుర్తుపట్టలేక పోతుంటాను.
అర్ధాంతరంగామెలుకోవటం ఈ ఆలోచనాపవ్యవస్థ ప్రభావమే.రెండవభాగంలో సత్యాన్నిగురించిన చర్చ ఉంది.ఇది "సత్యం అర్థాన్నికోల్పోవటం "ఈ భ్రాంతి తొలగటమే.యాకోబ్‌సన్(Roman,Jacobson)భాషయొక్క కార్యాలు కారకాలను గురించి చెబుతూ అధిభాష(Meta lingual)గురించి చెప్పాడు.జీవితం,బతుకు ఈరెండు పర్యాయాలుగానే కనిపించినా ఉపయోగంలో ఉండే కవిత్వార్థం(Poetic)రెంటిని వేరువేరు స్థాయిలనుంచి చెబుతుంది.జీవితం అపేక్షను,వాస్తవాన్ని స్పర్శిస్తే,బతుకు నిరపేక్షని,అనాసక్తిని చెబుతుంది.మొదటివాక్యంలో బతుకును నిర్వచించడానికి చేసిన ప్రయత్నం ఈ భావనను మోస్తుంది.
మనస్సుపై కోరిక చూపెట్టే రెండు ప్రతిఫలనాలు నాలుగవభాగంలో కనిపిస్తాయి.
మనస్సును
రంగుల మాస్క్ తో
మార్మికంగా
పలకరించినట్టు వుంటుంది
తన పదునైన గోర్లతో
పెకలిస్తున్నట్టు..
నేను
గాయమై స్రవిస్తున్నప్పుడు
నన్ను నేను నిశబ్దపు
లోయల్లోకి
జారవిడుచుకుంటూ....
సఘటనలు పరస్పరాధారితాలైనప్పుడు జరిగే వ్యవహారాలు ఇవి.మొదటిభాగం-రంగురంగుల్లో జీవితం ఎదురురావటం.రెండవభాగంలో వాస్తవంగా ఆలోచించినప్పుడు అవిబాధించడం కనిపిస్తాయి ఈ వాక్యాల్లో.దీనిని అపాతికత(Contingency)అంటారు.వాక్యాల్లో ఇనుపరెక్కలు-కూడా ఆశలోని భారాన్ని సూచిస్తాయి.
ఈ కవితలో ఆశావాదం(Optimism),వాస్తవం మధ్యజరిగే సంఘర్షణను చిత్ర్రించడం కనిపిస్తుంది.ఇలా మానసికంగా,భౌతికంగా జరిగే అన్ని విషయాలు గుర్తుండడం అనుషంగికస్మృతి(Incidental memory)అంతారు.ఇది అభ్యసనం ద్వారసాధిస్తారు.సాధారనంగా జరిగే అభ్యసనం ఇది.దీన్ని అనుషంగికాభ్యసనం(Incidental learning)అంటారు.
విష్యం చిన్నదేకాని.దాని చుట్టూ అల్లుకుని ఉన్న అంసాలు విస్తృతమైనవి.వస్తువుపై నిలబడటంపై ఖాన్ కు కొన్ని ఇబ్బందులున్నాయి.సంఖ్యాత్మకంగా వేసిన వుభాగం(numerical division)ఈ క్రమంలో కవి ఊహకు మేలు చేసింది.చాలా సార్లు వాక్యాలను లిఖితంగా ఇచ్చేప్పుడు పేర్చేపద్ధతి గురించి చెప్పుకున్నాం.వాక్యాలలోని పదాలమధ్య అర్థగతమైన సంలగ్న సంబంధం(Cohesive link)ఉంటుంది దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది.మనసికానుభవం కవితను ఒక కొత్త మార్గంలో ఎలానడిపిస్తుందో అర్థం చేసుకోడానికి ఈ కవితలో కొన్ని అంసాలు కనిపిస్తాయి.

Saturday, November 14, 2015

telugu translations from hindi

ఆలైన్/ విష్ణు ఖరే
మేము యెంతో ప్రేమతో స్నానించి
నిన్ను
శుభ్రమైన బట్టలు తొడిగాం
వొత్తైన నీ నల్లని జుట్టును దువ్వి
నీ పసి పాదాలను చుంభించాం
నీ బూటు దారాన్ని బిగుతుగా లాగి...
ఆట పట్టించే నెపంతో గాలీబు నీ
బుగ్గలపై ముద్దు పెట్టినప్పుడు
యెప్పటిలాగే తుడుచుకునే వాడివి
ఆ తడిని.... నీవు
యిప్పుడేమో యీ తడి యిసుకలో నిదురోతున్నావు యిక్కడ...
దూరం లేని మరో తీరం వైపు చూస్తో
నీ కళ్లు మూతపడ్డాయేమో
నీ కోసం వేచి చూస్తున్న నీ కొత్త స్నేహితులను వూహించుకుంటుండగా
నీకు నిదుర పట్టేసిందేమో....
మనం వచ్చే నావలో యెంతో సంతోషంగా ......నువ్వూ గాలీబు
నావను నడుపుతున్న నాన్నను చూస్తూ .....
భయపడుతున్న అమ్మను చూస్తూ ...
నవ్వుకుంటూ మీరు ముగ్గురు....
నావ సముద్రం నన్ను భయపెడ్తాయని
తెలుసు నీకూ ....అలలను బుజ్జగించావు
 సుతారంగా చేయి చరచి
యిప్పుడేమో నిద్దరోతున్నావు యిక్కడికి వచ్చి యీ తడి యిసుకపై...
నిన్ను యిలా చూసిన కన్నీళ్లాగునా...
యెవ్వరికైనా యింత ముచ్చటైన పిల్లోడు ....
నేలపైన నుదురు ఆన్చి యెవరి కోసమో ప్రార్థన లో లీనమయ్యాడు అని...
మెల్ల మెల్లగా లాలి పాడుతూ
నిను జో కొడుతున్న. అలలల్నే చూస్తూ వుండగా...
నీ కన్నులు మూత పడ్డాయేమో.....
నీవు యింకను నవ్వుతూ వున్నట్లే కన్పిస్తున్నావు
నిను వెతుక్కుంటూ వచ్చాం మేమిద్దరమూ....
నీ తల వైపున కూర్చుంటాం కొంత సేపు ...
నిద్దరోతున్న నీవు యెంత ముద్దొస్తున్నావో.. ..
నిను మేల్కొల్పాని మనస్కరించట్లేదు...
నీవు కల కంటున్నావేమో...నవ తీరాలను నయా మిత్రులను...
.నీ మేనత్తను తిమింగలమును...నువ్వేమో
యీ యిసుక తడిలో బోర్ల తిరిగి నిదురోతున్నావు..
యింత దూరం నీవు యేం గుర్తొచ్చిందని వచ్చవూ ..
నీ కోసం మేమూ రావాల్సొచ్చింది..
.పద యిప్పుడే యీ యిసుక తడిని యీ అలల లాలి పాటల్ని వదలి...
యీ అలలు సాయంత్రమయ్యాక తమ కౌగిట్లోకి లాక్కుంటాయి...
యేడిస్తే యేడవనీ మీ నాన్నాను అత్తనూ యెక్కడో దూరంగా .
.మనం ముగ్గురం కలిసే వున్నాం కదా..
వదలై కొత్తని అపరిచితంని కలకనడం
అలాగే చూడని తీరాన్ని మిత్రుల్ని
చూడు నా యెడమ చేతిని పట్టుకొని గాలీబు.
.మరో చేయి నీ కోసం వేచి చూస్తోంది..
వులికిపడి ఆశ్చర్యంతో ఆనందంతో మమ్మల్ని గుర్తించు..
నిను మా గుండెలకు హత్తుకోనివ్వు...
రా నీ బూటులో నుంచి యిసుకను తీసేస్తాను...
యిష్టమైతే వొ సారి తిరిగి చూసుకో.....
యీ తీరాలను దూరమైపోతున్న దిగంతాలను
పద మన కోసం యెదురు చూస్తోంది
విధ్వంసం తరువాతి వో బూడిద వొడి
(టర్కీ తీరంలో కనిపించిన అలైన్ పిల్లవాడి శవం ప్రపంచానంతటిని కన్నీరు పెట్టించింది...)


నేను నిన్ను మళ్ళీ కలుస్తాను.../అమృతాప్రీతం
(31.08.1919 - 31.10.2005)
నేను నిన్ను మళ్ళీ కలుస్తాను
యెక్కడా ..యెలా..
తెలియదు నాకు
ఒహుశ నీ వుహల్లో నిప్పుకణమై
నీ కాన్వాసుపై వాలుతాను
లేదా నీ కాన్వాసు పై
వో రహస్య రేఖలా మారి
నిశబ్దంగా చూస్తో వుంటాను.
సూర్యకిరణమై నీ రంగుల్లో కరుగుతాను
లేదా రంగుల బాహువుల్లో కూర్చొని
నీ కాన్వాసుకు...
తెలియదు నాకు
యెలా...యెక్కడ ...
అయితే నిన్ను తప్పనిసరిగా కలుస్తాను
వొక కళ్ళజోడుగా మారి వుండొచ్చును
యింకా యెగిరి దూకే సెలయేటి నీరై...
నేను నీటి చుక్కనై...నీ శరీరాన్ని మర్ధించి...
వొక చల్లదనమై నీ గండెల్ని చుట్టు కుంటాను...
నాకిక యేం తెలియదు
కాలంతో పాటు యీ నా ప్రాణం
పయనిస్తున్నదని మాత్రమే తెలుసు
యీ శరీరం
యెదో వో రోజు గతించక తప్పదు
అయితే సృష్టికణాలచే నిర్మింపబడ్డ
యీ చైతన్యపు దారాల్ని
చుట్టుకొని ....కణాల్ని యేరుకొని
నిన్ను నేను మళ్ళీ కలుస్తాను
(సౌజన్యం: నయా జ్ఞానోదయ్...యిది అమృతా ప్రీతం గారి చివరి కవిత.)

కవిత్వం / నరేంద్ర జైన్.
నాకు కవిత్వం
యినుపవూచలకు ఆవల కనిపించే
వో విశాలమైన ఆకాశం
అది
యెండలో...గాలిలో..
దుమ్ములో...ధూళిలో...
కొమ్మల్లో...గింజల్లో
కవిత్వం
కలల్లోను...పీడకలల్లోను...
స్మృతుల్లోనూ...విస్మృతుల్లోనూ....
అది
యెక్కడో దూరంగా విన్పించే వో స్వరం
నిరంతరం తలుపు తట్టి వెళ్ళిపోతుంటుంది....
కవిత్వం
వొక ఆత్మఘోష
వొక వొప్పంద పత్రం
బూడిదలో దాగిన అగ్నికణం
మంట నుంచి వేరవుతున్న నిప్పురవ్వ
చిరునామా లేని వుత్తరం...
అదొక
సంభాషణ
యెక్కడో ...
మౌనంలోని మార్మిక క్షణం
మూసిన గది అరుపు
గాయంపై లేపనం...
కవిత్వం
నీళ్ళతో నిండిన పాత్ర
పాత్రలో రాలే మధువు
కారణం యేంటో తెలుసా..
స్పందించే శ్వాస
స్పందనే కవిత్వం
నిత్యం రొప్పుతూ ...ఆలోచిస్తూ...
మనిషిలా కవి వెళ్ళిపోతూ...
పౌరజీవితాన్ని స్వీకరించి...
కానీ కవిత్వం
డేగవేటలా..
జీవిస్తూ...
ప్రస్తానిస్తూనే వుంటుంది....
(చాలా సంవత్సరాల క్రితం చదవి ముగ్ధుడినై, కవితో మాట్లాడీ...దాచుకున్న కవిత...)